సెంట్రల్‌ బ్లాక్‌, మొదటి అంతస్తు

కాశ్మీర్‌ గ్యాలరీ

జమ్ము, కాశ్మీర్‌ గుండా ప్రవహించే హిమాలయ నదుల్లో జీలం, చీనాబ్‌, సింధు ముఖ్యమైనవి. కాశ్మీర్‌ వాతావరణం ఋతువులు, భౌగోళిక పరిస్థితులు, పర్వతాలు మొ|| వాటిపై ఆధారపడి ఉంటుంది.

ప్రాచీనకాలం నుండీ అనూచానంగా వస్తున్న కళలలో పేపర్‌గుజ్జుతో వస్తువులు తయారుచేసే కళ ముఖ్యమైనది. దీని మూలాలు మనకు ప్రాచీన చైనాలో కనిపిస్తాయి. మొదట కాగితాన్ని నీళ్ళల్లో కరిగిపోయేవరకు నానపెడతారు. దాన్ని మెత్తగా రుబ్బి, జిగురు కలుపుతారు. తర్వాత ఆ ముద్దను మూసలలో వేసి ఆరబెడతారు. అది ఆరినాక, బయటకి తీసి, అందమైన చిత్రాలతో అలంకరించి బంగారుపూత కూడా పూస్తారు. ఇక్కడున్న కాశ్మీరు గ్యాలరీలో పేపర్‌ మెష్‌తో చేసిన భరిణెలు, అలంకరణ వస్తువులు, ఫ్లవర్‌ వాజులు అనేకం ఉన్నాయి.

అందంగా ఎంబ్రాయిడరీ చేయడమనేది కాశ్మీరు ప్రత్యేకతల్లో మరొకటి. ఇక్కడి జాలీపని చాలా ప్రసిద్ధి గాంచింది. ఒక షాలువపై ఎంబ్రాయిడరీ చేయాలంటే కొన్ని నెలలు పడుతుంది. స్టోల్‌ లేదా బెడ్‌ స్ప్రెడ్‌లపై కుట్టడం కూడా బాగా సమయం తీసుకునేపనే. డిజైన్లలో పక్షులు, పూలు, లతలు ఎక్కువగా కనిపిస్తాయి. కుట్లలో గొలుసుకుట్టు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ కుట్టుతో అందమైన డిజైన్లను ఎన్నింటినో కుడతారు. ప్రదర్శనలో పశ్మీనా, సోజ్ను శాలువలు అనేకం ఉన్నాయి.

కాశ్మీరు లోయలో అందరికీ బాగా తెలిసిన మరో కళ వడ్రంగం. తరచుగా ఇవి కాబినెట్లు, కుర్చీలు, టేబుళ్ళు, పెట్టెల రూపంలో కనువిందు చేస్తుంటాయి. ఇవి చేయాలంటే అనుభవం, ప్రావీణ్యం ఉండాలి. అక్రోటు కర్రతో సాధారణంగా ట్రేలు, సిగార్‌ పెట్టెలు, టేబుళ్ళు చేస్తుంటారు. ఈ కళ ఒక తరం నుండి మరో తరానికి పరంపరగా వస్తున్నది. శ్రీనగర్‌లోని జామామసీదు దగ్గరున్న ఖ్వాజా నక్షబంద్‌లో దీని అత్యున్నత నైపుణ్యం కనిపిస్తుంది. చెక్కతో అందమైన వస్తువులు చెక్కే కళ కాశ్మీరులో పరిమళించింది. ఈ రకానికి చెందిన అద్భుత కళాకృతులు ఈ గ్యాలరీలో కనిపిస్తాయి.